ముంబై, సెప్టెంబర్ 14
పసిడి ప్రియులకు మంచి సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా పడిపోతూ కొనేందుకు ఇదే మంచి సమయమని సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా వరుస పతనం మనం చూడొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో, దేశీయ మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. భారత మహిళలు పండగలు, ఇతర వేడుకలు, శుభకార్యాలు, వివాహాలు వంటి సమయాల్లో గోల్డ్ జువెలరీ ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ బంగారు ఆభరణాల అలంకరణ వారి అందాన్ని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. అందుకే ఈ సమయాల్లో గోల్డ్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రేట్లు కూడా అలాగే ఉంటాయని అనుకుంటాం.
అయితే ఈ శ్రావణ మాసం ఆఖరి రోజుల్లో బంగారం ధర భారీగా దిగొస్తుంది. గత 10 రోజుల్లో చూస్తే గోల్డ్ రేటు కేవలం రెండు రోజుల్లో మాత్రమే పెరిగింది. ఇక ఏకంగా 6 రోజులు పడిపోగా.. ఇవాళ మాత్రం కుప్పకూలింది. దీంతో కొనేవారికి ఇప్పుడు మంచి సమయం అని అంటున్నారు నిపుణులు.ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర పడుతూనే ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు దీనికి కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1910 డాలర్లకు దిగొచ్చింది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు కూడా 23 డాలర్ల దిగువకు చేరింది. మరోవైపు రూపాయి మారకం విలువ మళ్లీ పతనమైంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూ.83 వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో చూస్తే పసిడి రేట్లు భారీగా పతనం అయ్యాయి. ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఏకంగా రూ. 340 పడిపోయి 10 గ్రాములకు రూ.54,500 మార్కుకు చేరింది. కిందటి రోజు ఇది స్థిరంగా ఉండేది. 5 రోజులుగా వరుసగా పడిపోయింది. గత 10 సెషన్లలో రెండు రోజుల్లోనే పెరిగింది. సెప్టెంబర్ 4న రూ. 55,300గా ఉన్న రేటు ఇవాళ రూ.54,500కి చేరిందంటే.. రూ. 800 తగ్గింది.ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మరింత భారీగా పడిపోయింది. ఇది 10 గ్రాములపై రూ.380 పడిపోగా.. రూ. 59,450 మార్కును తాకింది. ఇది కూడా వరుసగా పడిపోతుండటం గమనార్హం.
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి చూస్తే రూ.770 వరకు పసిడి రేటు తగ్గడం గమనార్హం. దీంతో ఇది కూడా అందుబాటు ధరలోకి వచ్చిందని చెప్పొచ్చు.దేశ రాజధాని దిల్లీలో కూడా బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి రేటు తాజాగా రూ.340 పడిపోగా 10 గ్రాములకు రూ.54,650 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 దిగిరాగా.. 10 గ్రాములపై రూ.59,600 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ కూడా గత 10 రోజుల్లో చూస్తే బంగారం ధర 6 రోజులు పడిపోతూనే ఉంది.బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పతనం అవుతున్నాయి. ప్రస్తుతం దిల్లీ మార్కెట్లో కిలోపై రూ.1000 తగ్గి రూ. 73,500 మార్కు వద్ద కొనసాగుతోంది. క్రితం రెండు రోజుల్లో 1000 పెరిగినా ఇప్పుడు ఒక్కరోజులోనే పడిపోయింది. ఈ నెలలో సుమారు రూ. 4వేల వరకు వెండి రేటు తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో కూడా వెండి ధర రూ.1000 తగ్గి ప్రస్తుతం కిలోకు రూ. 77 వేల మార్కు వద్ద కొనసాగుతోంది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల, తగ్గుదల కనిపిస్తుంటుంది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన సమయంలో డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకొని.. బంగారం ధర పతనం అవుతుంటుంది. ఈసారి కూడా ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో బంగారం ధర ఇప్పుడు దిగొస్తుందని నిపుణులు చెబుతున్నారు.పసిడి, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఈ కారణంతో బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో.. దిల్లీ మార్కెట్తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి రేట్లను గమనిస్తే దిల్లీలో చాలా తక్కువకు లభిస్తుంది. హైదరాబాద్, దిల్లీల్లో ఈ రేట్లు చూస్తే దాదాపు రూ. 4 వేల తేడా కనిపిస్తుంది.