హైదరాబాద్, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్కు మెల్లిమెల్లిగా ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు కాగా.. ఇప్పుడు నవదీప్కు నార్కోటిక్ విభాగం పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈనెల 23న బషీర్బాగ్లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను ఏ-29గా పోలీసులు చేర్చారు. దీంతో.. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా.. అనంతరం పోలీసులు వినిపించిన వాదనల తర్వాత.. నవదీప్కు మంజూరైన ముందస్తు బెయిల్ కాస్త రద్దయింది.
దీంతో.. పోలీసులు ఆయనకు నోటీసులు పంపించారు.ఇదిలా ఉంటే.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తంగా 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో నవదీప్ సన్నిహితుడైన రామ్ చంద్ కూడా ఉన్నాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే.. నవదీప్ కూడా డ్రగ్స్ కన్జ్యూమర్గా గుర్తించారు. అయితే.. ముందుగా పరారీలో ఉన్నారంటూ పోలీసులు స్టేట్ మెంట్ ఇవ్వగా.. తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ స్పదించాడు నవదీప్. అయితే.. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ కూడా ఇచ్చారు.
అయితే.. అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని.. తాను ఎవరి ద్వారా డ్రగ్స్ కొన్నాడు, ఎక్కడ కొన్నాడు.. అన్న వివరాలు త్వరలోనే బయటకొస్తాయంటూ పోలీసులు పేర్కొన్నారు.రాంచందర్తో నవదీప్కు ఉన్న పరిచయాలపై పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ ఛాటింగ్తో పాటు.. కాల్ డేటాను కూడా సేకరించారు. వీటి ఆధారంగానే నవదీప్ను పోలీసులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పలుమార్లు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరవ్వాలంటూ పోలీసుల నుంచి నోటీసులు రావటంతో నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నవదీప్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.