హైదరాబాద్, ఫిబ్రవరి 16:తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదలకానుంది. అదే సమయంలో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభంకానుంది. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ అమలు, కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ స్పందనను బట్టి వీటి అమలుపై స్పష్టత రానుంది.’ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు; మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు” నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఏర్పాట్లపై జేఎన్టీయూ తలమునకలైంది. ప్రస్తుతం ఎంసెట్లో ఒక్కో సెషన్కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 40 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్ అయాన్ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎంసెట్ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్గా, చీఫ్ ఇంజినీర్గా పనిచేశారు.