ముంబై ,ఫిబ్రవరి 13:ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే కారు జనవరి 4న పర్లీ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ముండె ముంబైలో 39 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయన ఈరోజు తొలిసారిగా పర్లీలో అడుగుపెట్టారు. ముందుగా ఆయన గోపీనాథ్ కోటకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. పర్లీలో అడుగుపెట్టగానే తన తండ్రి పండిట్ అన్నా ముండే సమాధి వద్దకు వెళ్లి ఆయనకు వందన సమర్పణ చేశారు.అనంతరం ధనంజయ్ ముండే పర్లీ చేరుకున్నారు. అయితే అతడికి న భూతో న భవిష్యత్ అనే రేంజులో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు అభిమానులు. ముండేపై పూల వర్షం కురిపించేందుకు 101 జేసీబీలు ఉన్నాయి. ఆ జేసీబీల నుంచి 10 టన్నుల పూలవర్షం కురిపించారు. వైభవం చూసి అందరూ ఫిదా అయిపోయారు.
ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా జనం హాజరయ్యారు. డీజే, విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసి అభిమానులు కోలాహలం మధ్య ముండేను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా పార్లమెంట్ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు.ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ముండే ఛాతీపై దెబ్బ తగిలింది. పర్లీలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అతడి పక్కటెముకలు విరగడంతో పాటు తలకు కూడా దెబ్బ తగిలింది. 16 రోజుల చికిత్స అనంతరం జనవరి 19న డిశ్చార్జి అయ్యారు. అయితే కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని చెప్పడంతో ముంబైలోనే ఉండిపోయాడు.