సంక్షిప్త వార్తలు:04-20-2025:జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందా
సిఎం రేవంత్ రెడ్డి పిలుపు
టోక్యో ఏప్రిల్ 19
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ని పరిశీలించామని అన్న రేవంత్ మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని సిఎం పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి అని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు’ అని జపాన్లో స్థిరపడ్డ తెలుగువారిని ఉద్దేశించి సిఎం ప్రసంగించారు.
మంత్రులు జూపల్లి, పొంగులేటి , ఎంపి మల్లు రవిలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
నాగర్కర్నూల్ ఏప్రిల్ 19
మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపి మల్లు రవిలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్కర్నూల్ జిల్లాలో మంత్రులు, ఎంపి భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ ల్యాండ్ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అక్టోబర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
అక్టోబర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. అలాగే, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు, వరంగల్ సభ తర్వాత కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటామని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పిస్తామని.. కార్యకర్తలకు విషయాలపై అవగాహన ఉంటేనే మాట్లాడగలరన్నారని కెటిఆర్ అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం.. భవనం కుప్పకూలి నలుగురు మృతి
న్యూఢిల్లీ ఏప్రిల్ 19
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందిన విషాద సంఘటన ఢిల్లీ నగరంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముస్తఫాబాద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయిందని.. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణంలో అకస్మాత్తుగా వాతావరం చల్లబడి.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భవనం కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.