సంక్షిప్త వార్తలు:09-05-2025:తనకు జెడ్ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపుచేసి భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని లేదా సొంత వాహనాన్ని వినియోగించుకొనేందుకు అనుమతిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు.
జెడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్
విజయవాడ
తనకు జెడ్ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపుచేసి భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని లేదా సొంత వాహనాన్ని వినియోగించుకొనేందుకు అనుమతిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుగనుంది.
ఆర్ అండ్ బీకి సచివాలయాల అసిస్టెంట్ ఇంజినీర్లు
అమరావతి
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని 304 మంది అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)లను రోడ్డు, భవనాల శాఖ (R&B) ఉపయోగించుకోవడానికి సీఎం చంద్రబాబు అనుమతించారు. రూ.3200 కోట్లతో రహదారి విస్తరణ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉందని ఉన్నతాధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సచివాలయ ఇంజినీరింగ్ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు.
విద్యార్థులారా జర భద్రం!
విద్యార్థులకు డ్రైవింగ్ వస్తే చాలు
ఏలాంటి రూల్స్ వారికి అవసరం లేదు, లైసెన్సు లేకున్నా, సిగ్నల్స్ తో పని లేకుండా వాహన మీద త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఏలాంటి నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మైనర్లు కు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం కారణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని . పలువురు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు నడుపుతున్నారని సంతోషంలో ఉంటున్నారు. కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధపడాల్సింది కూడా వాళ్లే తల్లిదండ్రులు వేసవికాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందా అని పలువురు అంటున్నారు.
సీపీ బ్రౌన్ గ్రంథాలయ భవనం నిర్మించండి
గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానమద్ది విజయ భాస్కర్ విజ్ఞప్తి
కడపలో ప్రాముఖ్యత కలిగిన సీపీ బ్రౌన్ గ్రంథాలయ భవనం నిర్మించమని ఆ గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానమద్ది విజయ భాస్కర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సీపీ బ్రౌన్ గ్రంథాలయ అదనపు భవన నిర్మాణం కోసం కొందరు న్యాయమూర్తుల చొరవ వల్ల గత ప్రభుత్వం 2023లో రూ.3-60 కోట్ల నిధులు విడుదల చేసింది. 2024 జనవరిలో నిర్మాణ పనులు చేయడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APEWIDC)కు అనుమతి ఇచ్చింది. టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ని కూడా ఎంపిక చేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ సామాగ్రి కూడా సిద్ధం చేసుకున్నారు.
పనులు చేయడానికి సిద్ధమై ఏప్రిల్ 29న భూమి పూజ, శంకు స్థాపనకు సిద్ధమై, శిలా ఫలకం, ఆహ్వాన పత్రికల పంపిణీ అన్నీ పూర్తి అయ్యాయి. చివరి క్షణంలో ప్రధాన మంత్రి మోదీ పర్యటన కార్యక్రమం వల్ల భూమి పూజ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు అన్నది తెలియని పరిస్థితి. ఈ పనులను ఎప్పుడు మొదలు పెడతారో తెలియడంలేదు. ఆలస్యం అయితే, నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. వానల వల్ల పనులు కూడా జరగవు. ఈ విషయాన్ని పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్, సీపీ బ్రౌన్ గ్రంథాలయ ప్రధాన పోషకులు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ను జానమద్ది విజయ భాస్కర్ కోరుతున్నారు. ఈ గ్రంథాలయం ఇది తెలుగు భాషాభిమానుల ఆస్తిగా ఆయన పేర్కొన్నారు.