Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రకృతికి ఎలాంటి హాని చేయకూడదని భావించిన చంద్రబాబు సర్కార్.. చెట్లను తొలగించి.. వాటిని మళ్లీ ఇతర ప్రాంతాల్లో నాటుతోంది.
దేశంలోనే తొలిసారి ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్లొకేషన్
విజయవాడ మే 19
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రకృతికి ఎలాంటి హాని చేయకూడదని భావించిన చంద్రబాబు సర్కార్.. చెట్లను తొలగించి.. వాటిని మళ్లీ ఇతర ప్రాంతాల్లో నాటుతోంది. దీనివల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం జరగదని భావిస్తోంది. అమరావతిని హరిత నగరంగా మార్చడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. అమరావతే రాజధాని అని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శరవేగంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే అమరావతి రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. వినూత్న ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే తొలిసారి ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్లొకేషన్ పద్దతిని చేపడుతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలో భాగంగా రోడ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న వందలాది చెట్లను ఉన్న ప్రాంతం నుంచి తీసి.. సురక్షితంగా మరో చోటుకు తరలించి అక్కడ మళ్లీ నాటుతోంది. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని భావిస్తోంది.సాధారణంగా రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి పనులు చేస్తున్నారంటే.. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికివేస్తూ ఉంటారు. అయితే ఇలా భారీ ఎత్తున చేపట్టే అభివృద్ధి పనుల్లో చెట్లను నరికేయడం ద్వారా.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు.. చెట్లను నరికివేయకుండా ట్రీ ట్రాన్స్లొకేషన్ పద్ధతి ద్వారా వాటిని సురక్షితంగా తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగానే చెట్ల కొమ్మలను కత్తిరించి.. చెట్టు మొదట్లో చుట్టూ తవ్వి కొంతమేర వేళ్లను కత్తిరిస్తారు. ఆ తర్వాత వేరు వ్యవస్థ కుళ్లిపోకుండా దానికి ఫంగల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. వేరు చుట్టూ ఉన్న మట్టితో సహా చెట్టును క్రేన్ సహాయంతో పైకి లేపి.. చుట్టూ గోనె సంచిని చుడతారు.ఆ తర్వాత.. అక్కడ తీసిన చెట్లను తుళ్లూరు మండలం అనంవరంలోని ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్కు తరలిస్తారు. ఆ సెంటర్లో పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో కోకోపిట్, ఎర్రమట్టి, ఎరువులు కలిపిన మిశ్రమాన్ని నింపి, డ్రిప్ ద్వారా నీటి తడులను ఆ చెట్లకు అందిస్తారు. సాధారణంగా ఈ పద్ధతిలో చెట్లు బతికే అవకాశం 40 శాతం మాత్రమే ఉంటుంది. అయితే ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా 85 శాతం వరకు చెట్లను కాపాడే అవకాశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలా కొన్నిరోజులు సంరక్షించబడిన వేలాది చెట్లను అమరావతిలోని గ్రీన్ జోన్లలో నాటేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అమరావతిని పచ్చని నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం చాటి చెప్పనుందని పేర్కొన్నారు.