మచిలీపట్నం ఫిబ్రవరి 13: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో వంగవీటి మోహనరంగా గురించి ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన ఆయన.. వంగవీటి మోహనరంగా గురించి తెలియని తెలుగువారు ఉండరన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఆయన్ను ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. అత్యంత పెద్ద సామాజికవర్గమైన కాపులకు చెందిన రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి రంగాను కొందరు ద్రోహుడు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వంగవీటి రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో.. ‘కాపునాడు’ సభలను నిర్వహిస్తున్న టైంలో ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు. లక్షల మంది ప్రజలు, కాపు వర్గం నేతలు వంగవీటిని సమర్థించిన సమయంలో.. ఆయన్ను హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని జీవీఎల్ పేర్కొన్నారు. రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను ప్రజలు స్మరించుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలియజేశారు. ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, కానీ రంగా పేరును మాత్రం పెట్టలేదని తెలిపారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని జీవీఎల్ వెల్లడించారు. గతేడాది వంగవీటి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాల్సిందిగా జీవీఎల్ డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి సంపూర్ణ రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన.. కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెట్టడంతో పాటు విశాఖ బీచ్ రోడ్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కాపులను కేవలం ఓటుబ్యాంకుగా చూసే వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గ నాయకులకు అధికవాటాను కల్పించాలని కోరారు.