వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ ఎమ్మెల్యేగా మారిన తర్వాత నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సమర్థుడైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తమకు ఒక సమర్థుడైన నాయకుణ్నివ్వాలని, మార్గదర్శనం చేయిమంటూ కోరారు. వంశీ పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించినప్పటికీ అనారోగ్యంతో ఆయన కన్నుమూయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అదే సమయానికి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి దిగారు.
అనంతరం 27 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. కొనకళ్లకు బాధ్యతలు ఈ పరిణామాల తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు బాధ్యతలు అప్పగించడంతోపాటు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కొనకళ్ల కూడా నియోజకవర్గ నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం కష్టమవుతోంది. దీంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు తమకు ఒక బలమైన నాయకుణ్ని ఇవ్వమని చంద్రబాబును కోరుతున్నారు.
వైసీపీ నుంచి ఒక ముఖ్య నాయకుడు పార్టీలో చేరతారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ ఆయన అదిగో.. ఇదిగో అంటూ వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా పార్టీ మార్పు అనేది ఆగస్టుకు వాయిదా వేశారు.చంద్రబాబు ఇటీవలి కృష్ణా జిల్లా పర్యటనలో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లు దాసరి జైరమేష్, దాసరి బాలవర్ధన్ రావు సోదరులు చూశారు. ప్రస్తుతం వీరు వైసీపీలో ఉన్నారు. టీడీపీలోకి వస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ దాసరి జైరమేష్ గన్నవరం నుంచి పోటీచేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
మరోవైపు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు గన్నవరం నుంచి తన తల్లి దేవినేని అపర్ణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో వీరు సమావేశమై సహకరించాలని కోరగా పార్టీ ఆదేశాలు వస్తే సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. వాటర్ కూలర్ల పంపిణీ తాజాగా వీరు ప్రార్థనా మందిరాలకు చెందిన పాస్టర్లతో సమావేశమై 40 మందికి వాటర్ కూలర్లు పంపిణీ చేశారు. రెండు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
17 నుంచి 3 రోజుల పాటు ఏనుగుల లెక్కింపు.
ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని ఫౌండేషన్ తరఫున కేశినేని చిన్ని, గుడివాడలో ఎన్నారై వెనిగండ్ల రాము తరహాలో సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. త్వరలోనే ఇన్ ఛార్జి నియామకం ఉంటుందికాబట్టి ఇది తమకు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కూడా వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీచేయడానికి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. మరి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారో? ఎవరు నియోజకవర్గంలో పార్టీని విజయతీరాలకు చేరుస్తారో చూడాల్సి ఉంది.