నెల్లూరు: ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం నాడు సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి-డి2 ప్రయోగం విజయవంతమైంది. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఎస్ఎస్ఎల్వి-డి2 రాకెట్ ను ప్రయోగించారు. 2022 ఆగస్టు 7న ఇస్రో ప్రయోగాత్మకంగా నిర్మించి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి-డి 1 రాకెట్ సాంకేతిక కారణాలతో విఫలమైని సంగతి తెలిసిందే. అది ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయింది. తాజాగా లోపాల్ని సరిదిద్ది ఎస్ఎస్ఎల్వి-డి2 రాకెట్ రూపొందించి ప్రయోగించారు. 6.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎస్ఎస్ఎల్వి-డి2 రాకెట్ 334 కిలోల బరువుండే మూడు రాకెట్లతో నింగిలోకి దూసుకెళ్లింది.
ఇందులో రెండు దేశీయ ఉపగ్రహాలు కాగా, అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తొలి ఉపగ్రహమైన ఈవోఎస్-07ను 785 సెకన్లకు, రెండోదైన జానుస్-1ను 880 సెకన్లకు, చివరిదైన ఆజాదీశాట్ను 900 సెకన్లకు వరుసగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలోని ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. దీని బరువు 156.3 కేజీలు. అలాగే, ఆజాదీశాట్-2 ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించారు. దీని బరువు 8.7 కేజీలు. ఇక, జానుస్-1ను అమెరికాకు చెందిన అంటారిస్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని బరువు 11.5 కేజీలు. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించినట్లయింది.