హైదరాబాద్, జనవరి 28,
జనవరి 30, 31 తేదీల్లో (సోమవారం, మంగళవారం) మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే నిరభ్యంతరంగా బ్యాంకులకు వెళ్లవచ్చు. ఎందుకంటే, ఆ రెండు రోజుల్లో తలపెట్టిన బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ముంబైలో జరిగిన రాజీ సమావేశంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎప్బియూ) ఏకాభిప్రాయానికి రావడంతో.. జనవరి 30, 31 తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను అన్ని బ్యాంక్ యూనియన్లు వాయిదా వేశాయి.తమ డిమాండ్లపై బ్యాంకు యూనియన్లు జనవరి 31న చర్చిస్తాయని బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. జనవరి 31న యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించిందని వెల్లడించారు. వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్, పింఛను పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల మీద జనవరి 31న చర్చించాలని శుక్రవారం జరిగిన రాజీ సమావేశంలో నిర్ణయించారు. ఇతర సమస్యల మీద సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చిస్తామన్నారు.బ్యాంకు యూనియన్ల సమూహం యూఎప్బియూ, తమ వివిధ డిమాండ్ల కోసం సమ్మె చేయాలని గతంలోనే నిర్ణయించింది. తమ డిమాండ్లను చాలా కాలం క్రితమే మంత్రివర్గం ముందు ఉంచినా, ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీహెచ్ వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకు యూనియన్లు 5 రోజుల బ్యాంకింగ్ వర్కింగ్ కల్చర్తో పాటు అనేక డిమాండ్లు చేశాయి. పెన్షన్ అప్గ్రేడేషన్, ఇతర సమస్యలకు పరిష్కారం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించడం, అన్ని కేడర్లలో ఖాళీల భర్తీ కోసం వెంటనే రిక్రూట్మెంట్ వంటి అనేక సమస్యలను బ్యాంక్ యూనియన్లు వెల్లడించాయి. డిమాండ్స్ చార్టర్పై చర్చలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ, యూఎప్బియూ సమ్మెకు పిలుపునిచ్చింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం… 2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకుకు చాలా సెలవులు ఉన్నాయి. ఆ నెల మొత్తంలో, వివిధ రాష్ట్రాల్లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తారు. ఫిబ్రవరి నెలలో వచ్చే సెలవుల్లో శని, ఆదివారాలు కాకుండా.. మహాశివరాత్రి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోని మొత్తం 28 రోజుల్లో, వివిధ రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవు తేదీలు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.