ములుగు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొందరు బేరగాళ్లు ములుగు జిల్లా ములుగు మండలం అంకన్నగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల నుంచి పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పత్తిని ట్రక్కుల్లో తరలించిన దళారుల మోసాన్ని రైతులు తేటతెల్లం చేశారు. దళారులు తీసుకొచ్చిన కాంటాతో పత్తిని ఎక్కువ తూకం వేసుకుని తరలించినట్లు గుర్తించారు. అంకన్నగూడెంకు చెందిన పలువురు రైతులు మరో ఎలక్ట్రిక్ కాంటా తేవడంతో మోసం బహిర్గతం అయ్యింది.
రైతుల పత్తి బస్తాను తూకం వేస్తే దళారులు తెచ్చిన కాంటాలో 8క్వింటాళ్ల పత్తి 4.5క్వింటాళ్లుగానే తూకం వేశారు. తూకంలో మోసం ఉందని గ్రహించి మరో కాంటా తెచ్చి తూకం వేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన రైతులు దళారులపై దాడి చేశారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర ఇస్తామని ఆశ చూపుతూ మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు