Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అప్పుల చిట్టా ఇది…

0

హైదరాబాద్ , ఫిబ్రవరి 14:తెలంగాణ అప్పుల లెక్కలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి  లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.  గత ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4,33,817.6 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పులు భారీగా పెరిగాయని  కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పుల మొత్తమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటికి రూ.75,577 కోట్ల అప్పులు ఉంటే, 2021-22 నాటికి అప్పులు కాస్త రూ.2,83,452 కోట్లకు చేరాయని తెలిపింది.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదిక ఇచ్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తోందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని.. నేడు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో చేర్చారని విపక్ష నేతలు బీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. తెచ్చిన అప్పులను కూడా సరైన రీతిలో వినియోగించడం లేదని… యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యపడుతున్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతున్న సర్కార్… తెచ్చిన అప్పులతో.. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని అంటోంది.

తద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ మొత్తంలో రెవెన్యూ వస్తుందని చెబుతోంది.మరోవైపు… మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోను అప్పులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థికశాఖ మరోసారి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ అప్పులపై రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి… 2019 నుంచి 2023 వరకు పెరిగిన అప్పుల వివరాలను వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రూ. 1.50 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకుల తెలిపాయి. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లు అని కేంద్రం లోక్ సభలో ప్రకటించింది.

తెలంగాణ అప్పులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. 2014-15లో రూ. 8,121 కోట్ల అప్పులు తీసుకోగా, 2015-16లో రూ. 15,515 కోట్లు, 2016-17లో రూ. 30,319 కోట్లు, 2017-18లో రూ. 22,658 కోట్లు, 2018-19లో రూ. 23,091 కోట్లు, 2019-20లో రూ. 30,577 కోట్లు, 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,50,365.6 కోట్ల అని కేంద్రం వెల్లడించింది. తెలంగాణకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా, రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు అవ్వగా రూ. 852 కోట్లు ఇచ్చామని తెలిపింది. వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు తెలంగాణకు మంజూరు కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie