ముద్ర ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ నుండి ఇనుగుర్తి వరకు రూ.12 కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు, రూ. 20 లక్షలతో చేపట్టిన రెడ్లవాడ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి, కోటి 70 లక్షలతో చేపట్టిన రెడ్ల వాడ గ్రామ అంతర్గత సీసీ రోడ్ల పనులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేసారు.
అనంతరం రెడ్లవాడ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు వంటి పథకాలు గతంలో ఎప్పుడైనా చూశారా? నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కేసీఆర్ లాంటి గొప్ప సీఎం ను నేను చూడలేదన్నారు. ఎన్టీఆర్ తర్వాత నేను కేసీఆర్ నే ఇష్ట పడతానని, నాకు గొప్ప అవకాశం ఇచ్చి మంత్రిని చేశారన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అభివృద్ధికి పాటు పడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మంచి ఎమ్మెల్యే వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే అయితే, ఇంకా అభివృద్ధి జరిగేదన్నారు. ప్రజలు మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకావాలని కోరారు. తన శాయ శక్తులూ ఒడ్డి సీఎంతో మాట్లాడి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంను ఎప్పుడు కలిసినా, పెద్ది నియోజకవర్గం గురించే మాట్లాడుతాడని, అలాంటి ఎమ్మెల్యే మీకు ఉన్నందుకు మీరు అదృష్టవంతులన్నారు.
ఇక రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎంను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మరింత గా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని, సీఎం కేసీఆర్ , మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ పురోగతికి పూర్తిగా సహకరిస్తున్నారని, వారికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ అండ్ బి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.