విజయవాడ, జనవరి 28,
ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 7 ఎంపీపీ అధ్యక్షులు, 11 ఎంపీపీ ఉపాధ్యక్షులు, 6 కోఆప్టెడ్ సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 3న ఈ ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నిక నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వీటితో పాటు జనవరి 30వ తేదీలోగా మండల పరిషత్ ప్రత్యేక సమావేశం కోసం నోటీసు జారీ చేయాల్సిందిగా తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలు ఇవే..
అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల, ఎన్టీఆర్ జిల్లా లోని గంపలగూడెం, నెల్లూరు జిల్లాలో జలదంకి, తిరుపతిలోని చిల్లకూర్, చిత్తూరు, కర్నూలు జిల్లా మడికెరలో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఎస్.రాయవరం, పిడుగురాళ్ల, సంతమాగులూరు, ఆలూర్, విడపనకల్లు, చెన్నేకొత్తపల్లి మండలాల అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది.