హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి (ఆదివారం) ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో, జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పార్టీ పూర్వ వైభవం కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తామన్నారు. 10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని ఆయన తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేయనున్నామని కాసాని వెల్లడించారు.