సర్పవరం:ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా మారడంతో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, వీరి రక్షణకు పలు చట్టాలు అమలులో ఉన్నందున వాటిపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా సంఘ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని అన్నారు. వారు నిర్లక్ష్యం చేస్తే రెవిన్యూ డివిజన్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. పిల్లల మాయ మాటలు విని ముందుగానే ఆస్తిని వారికి వ్రాసిన యెడల వారు మోసం చేస్తే తిరిగి ఆ ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఏదేమైనా పిల్లలకు ముందుగానే ఆస్తిపాస్తులు ఇవ్వరాదని, దాన పట్టా ద్వారా తమ తదనంతరం అందే విధంగా వ్రాయడం మంచిదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పరచాలని ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి వర్గాలను కోరినట్లు తెలిపారు. వృద్ధులకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్లో తక్షణం స్పందించే విధంగా పోలీసు ఉన్నతాధికారులను ఆ సమావేశంలో కోరినట్లు తెలిపారు. వృద్ధులకు ఏ సమస్య వచ్చినా జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ 14567 కు ఫిర్యాదు చేయాలని బుద్ధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.