హైదరాబాద్, ఫిబ్రవరి 18, (న్యూస్ పల్స్): ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే.. ఈడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ అనుమానాలే బలపడుతున్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపు పోషించిన పాత్ర కీలకమని ఈడీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి ఈ గ్రూపును నడిపించినట్లు ఆరోపించింది. ఇందులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవను, శరత్చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు. తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరి వంతు అవుతుందనే చర్చలు మొదలయ్యాయి.
కేసులో ఈడీ కవిత భర్త అనిల్కు కూడా నోటీసు జారీచేసి ప్రశ్నించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన టైంలో అంటే గత ఏడాది మేలో హైదరాబాద్ లో కవిత నివాసంలోనే చర్చలు జరిగాయని ఈడీ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. ఆ సమావేశంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్, పిళ్ళై, బోయిన్పల్లి అభిషేక్, శరత్చంద్రారెడ్డి పాల్గొన్నారని ఈడీ అంటోంది. ఆ రోజు చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఈ స్కామ్లో ఏ మేరకు ఆయనకు భాగస్వామ్యం ఉంది అన్న వివరాలను రాబట్టేందుకు కవిత భర్తను ప్రశ్నించాలని ఈడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.