A place where you need to follow for what happening in world cup

ధాన్యం బకాయిలు కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..

0

రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు లో రైతులు ధర్నా
పెదపాడు (కొత్తూరు) ఫిబ్రవరి 21:రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు,కౌలు రైతులు ధర్నా నిర్వహించారు.రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు,కౌలు రైతులు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్మి 40 రోజులు గడుస్తున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించి అమ్మితే ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం వలన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి అన్నదాతల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 9 తర్వాత రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించలేదన్నారు.

కొత్తూరు ఆర్ బి కే పరిధిలో సుమారుగా రూ.3 కోట్లు, కొత్త ముప్పరు ఆర్ బి కే పరిధిలో సుమారుగా రూ.4 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించాల్సిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వడ్డీతో చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్ది బోయిన కాశీ విశ్వనాథం, పల్లపోతు శ్రీనివాసరావు, పల్లపోతు రెడ్డియ్య, కన్నెగంటి పూర్ణచందర్రావు,చెన్ను బోయిన దుర్గారావు, దన్నే నాగేంద్రరావు,శనగల సత్యనారాయణ, కడిమి రాజు, చెడుగొండి సూర్యనారాయణ,కవ్వూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.