న్యూ డిల్లీ ఫిబ్రవరి 7
తుర్కియే, సిరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం నుంచి వరుసగా సంభవించిన భారీ భూకంపాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అక్కడ మృతుల సంఖ్య ఐదువేలు దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఒక్క తుర్కియేలోనే సుమారు 4 వేల మంది మరణించగా.. 20,534 మంది ప్రజలు గాయపడ్డారు.ఇకసిరియాలో 1,602 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,649 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 5వేల మందికి పైనే మృతి చెందారు.
భారీగా సంభవించిన భూకంపం ధాటికి తుర్కియేలో ఇప్పటి వరకు 11వేలకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు 25వేల మంది ఎమర్జెన్సీ వర్కర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి. గాయపడ్డవారిని తరలించేందుకు 10 నౌకలు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకావం ఉన్నట్లు తెలిపింది.