తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.111ను రద్దు చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల అభివృద్ధికి జీవో 111 అడ్డుగా ఉంటుందని, అందుకే ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ జీవో రద్దుతో హైదరాబాద్ కు అత్యంత చేరువలో ఉన్న భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతిలేక ఇబ్బందిపడుతున్న గ్రామాల వారికి ఎంతో ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్ కు తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల సమయంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు.
ఈ జలాశయాలు కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు గండిపేట్, హిమాయత్ సాగర్పై ఆధారపడి లేదని, కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయని భావించిన ప్రభుత్వం… 111 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నగర విస్తరణకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జీవో పరిధిలోని లక్షల ఎకరాలు అందుబాటులోకి వస్తే భూముల ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.జీవో 111 రద్దు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ లో జీవో 50ని ప్రవేశపెట్టే సమయంలో నిర్మాణ సంస్థలతో ప్రభుత్వం పలుసార్లు చర్చించింది. అదేవిధంగా కూల్ రూఫ్ పాలసీ ప్రవేశపెట్టే సమయంలో నిర్మాణ సంఘాలతో చర్చించారు. వారి సలహాలు, సూచనలు తీసుకుని విధివిధానాలు రూపొందించారు. అయితే జీవో 111 రద్దు విషయంలో నిర్మాణ నిపుణులతో చర్చించలేదన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేసే ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఎటువంటి సూచనలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. జీవో రద్దుపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి.
గతంలో సుప్రీంకోర్టు సైతం 111 జీవోను సమర్థించింది. ఈ జీవో వ్యవహారం ప్రస్తుతం ఎన్జీటీ, హైకోర్టు పరిధిలో ఉంది. 2022 సెప్టెంబరులో 111 జీవోను ఎత్తివేయలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. జంట జలాశయాలకు మురుగునీరు రాకుండా చర్యల్ని తీసుకుంటామని చాలాసార్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ మార్పు చేసి 111 జీవోను అమలు చేస్తామని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. సడెన్ గా జీవో రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. 111 జీవో రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన తర్వాతే స్పందిస్తామని పలు నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి.
ఈ జీవో ఎత్తివేత రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బే అంటున్నారు.ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా ఉండేందుకు ఉమ్మడి ఏపీలో 111 జీవో తీసుకొచ్చారు. ఆ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల నిర్మాణాలు నిషేధిస్తూ జీవో తెచ్చారు. అయితే ఈ జీవో కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంలేదని ప్రభుత్వం వాదన. ఈ జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటి అవసరం హైదరాబాద్ నగరానికి పెద్దలేదని అంటోంది.
అందుకే 84 గ్రామాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో, హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించేందుకు జీవో 111 రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఈ 84 గ్రామాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవని, హెచ్ఎండీఏకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే ఈ జీవో రద్దుతో ఆక్రమణలు, కబ్జాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందని దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మనుగడే ప్రశ్నార్థకం అవుతోందని ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. జీవో రద్దు నిర్ణయంపై కోర్టులను ఆశ్రయిస్తా్మంటున్నారు.