విజయవాడ, జనవరి 16, (న్యూస్ పల్స్)
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు. నేను టీడీపీలోనే ఉంటా.. మీరే టీడీపీలోకి రావాలంటూ పలువురు వైసీపీ నాయకులను రాధా ఆహ్వానించారు. రెండురోజుల క్రితం వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంటికి రాధా వెళ్లారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. భవకుమార్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలను తెలుగుదేశం పార్టీలోకి రావాలని రాధా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు టీడీపీ – జనసేన పార్టీలు పొత్తుతో వెళ్తున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమిలో వంగవీటి రాధా కీలక భూమిక పోషించబోతున్నారని సమాచారం.వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో మళ్లీ రాధా వైసీపీలో చేరుతారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. పలువురు వైసీపీ నేతలుసైతం వంగవీటి రాధా వైసీపీలోకి వస్తున్నారని తమ క్యాడర్ వద్ద ప్రస్తావించినట్లు వార్తలువచ్చాయి.
ఈ క్రమంలో వంగవీటి రాధాను వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కానీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనికితోడు ఇటీవల వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధా కాశీ వెళ్లారు. కాశీలో తన తండ్రి రంగా తర్పణంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రంగా వెంట వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికూడా ఉన్నారు. కాశీలో రంగా, కొండాలి నాని కలిసిఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగా వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. తాజాగా వంగవీటి రాధా ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మరికొందరు వైసీపీ నేతలను టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారని స్పష్టత రావడంతో వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.
2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా రంగా విజయం సాధించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలోకిదిగి ఓటమి పాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంగా మళ్లీ ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2019లో టీడీపీలో చేరారు. వంగవీటి రాధా టీడీపీలో చేరినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదని చర్చ జరుగుతూ వచ్చింది. తాజాగా రాధా రాజకీయాల్లో యాక్టీవ్ కావడంతోపాటు టీడీపీలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ – జనసేన కూటమిసైతం రంగా సేవలను విసృతంగా ఉపయోగించుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో రంగాకు బలమైన ఇమేజ్ ఉంది. ఆ మేరకు రంగా సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు భావిస్తున్నట్లు సమాచారం.