Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బంగారు గనులు….కేరాఫ్ కర్నూలు

0

కర్నూలు, డిసెంబర్ 19,

రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని వజ్రకరూరు, జొన్నగిరిలో వజ్రాలు, విలువైన రంగురాళ్లు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోనూ బంగారం గనులు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం తేల్చి చెప్పింది. రాయలసీమ రాళ్లలో బంగారం వజ్రాలు దాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫ్యాక్షన్‌తో, వర్గ కక్షలతో నలిగిపోయిన, ఆస్తి ప్రాణ నష్టం కోల్పోయిన కప్పట్రాళ్ల లాంటి ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నట్లు సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్రం మంత్రి ప్రకటించడం చూస్తే నిజంగా కర్నూలు జిల్లాకు మంచి రోజులు వచ్చాయా అనిపిస్తుంది.కర్నూలు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన కరువు ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. నాలుగు రోజుల క్రితం విజయవాడలో జరిగిన GSI రాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఎంత పరిమాణంలో ఉన్నాయి, నాణ్యత ఎంత, ఎంత విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నాయి.. అనే అంశంపై చర్చ జరిగింది. త్వరలో మరోసారి జీఎస్ ఐబృందాలు పరిశీలించాలని కూడా నిర్ణయించింది.

ఆస్పరి మండలంలోని చిరుమాను దొడ్డి, అట్టే కళ్ళు, కల్లపరి, యాటకల్లు సహా పరిసర గ్రామాల్లోని భూములలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జిఎస్ఐ నిర్ధారించింది.వాస్తవంగా ఆస్పరి మండలం అనేది పూర్తిగా వెనుకబడిన కరువు ప్రాంతం. వర్షాలు వచ్చినా కూడా పంటలు అంతంత మాత్రమే పండే భూములే ఇక్కడ. అలాంటి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని ఆశిస్తున్నారు.సర్వే జరిపిన ప్రాంతం నుంచి ఆ ప్రాంత రైతులు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అనే అంశాలపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.ఇక్కడే కాకుండా ఈ గ్రామానికి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరుమాను దొడ్డి గ్రామ పొలాలలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జిఎస్ఐ తెలిపింది. ఆ ప్రాంత వాసులలో కూడా ఆశలు చిగురించాయి. భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేని తమకు బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలియగానే ఆశలు చిగురించాయని.. పిల్లల భవిష్యత్తుపై భరోసా పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు.ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ ఇచ్చిన సమాచారం సంతోషకరమైనప్పటికీ.. బంగారు వజ్రాలు కర్నూలు జిల్లాలో చాలా ఏళ్ల నుంచి ఉన్నట్లు నిర్ధారణ అయింది. తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో వర్షం వచ్చింది అంటే చాలు ఎవరికో ఒకరికి కచ్చితంగా ఇప్పటికీ వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. కూలీలు రైతులు స్థానికులు రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతున్నారు.

ఇదే మండలంలోని పెరవలి గ్రామంలో, పరిసర ప్రాంతాలలో వజ్రాల వ్యాపారులు ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే తుగ్గలి మండలంలోని పగిడిరాయి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి.జియో మైసూర్ కంపెనీ ఈ బంగారు ఖనిజాలను తవ్వకాల ద్వారా వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే వందలాది ఎకరాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే చిన్నచిన్న మిషిన్లను ఏర్పాటు చేసి భూగర్భంలో నుంచి బంగారాన్ని వెలికి తీసే కార్యక్రమం చేపట్టింది. భారీ యంత్రాలను సమకూర్చి బంగారు గనుల తవ్వకాల కోసం జియో మైసూర్ కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. 70 శాతం భూములను కూడా కొనుగోలు చేసింది. 30% భూముల కొనుగోలు విషయంలో చిన్న చిన్న అభ్యంతరాలు తొలగిపోతే పూర్తిస్థాయిలో బంగారు గనుల తవ్వకాలు చేస్తామని జియో మైసూర్ కంపెనీ ప్రకటించింది. కేంద్రమంత్రి పార్లమెంటులోనే బంగారం లాంటి ప్రకటన చేశారు. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల గ్రామ పరిసరాలలో యురేనియం నిలువలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని కేంద్ర మంత్రి ప్రకటించడంతో ఈ ప్రాంతంలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన కప్పట్రాళ్ల లాంటి ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉండి, వాటిని ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాంతమంతా అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie