China-Pak : సార్క్కు ప్రత్యామ్నాయంగా చైనా-పాక్ కొత్త కూటమి? బంగ్లాదేశ్ ఖండన:దక్షిణాసియాలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన సార్క్ (SAARC) కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త గ్రూప్ను ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్ స్థానంలో ఈ కొత్త వేదికను తీసుకురావాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
దక్షిణాసియా రాజకీయాలు: సార్క్కు ప్రత్యామ్నాయంపై ఊహాగానాలు, ఖండనలు
దక్షిణాసియాలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన సార్క్ (SAARC) కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త గ్రూప్ను ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్ స్థానంలో ఈ కొత్త వేదికను తీసుకురావాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్థాన్కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ దౌత్యవేత్తలను ఉటంకిస్తూ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.
పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం, ఈ కొత్త కూటమి ఏర్పాటుపై చైనా, పాకిస్థాన్ల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగానే ఇటీవల చైనాలోని కున్మింగ్ నగరంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సార్క్లోని మిగతా దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్థాన్లను కూడా ఈ కొత్త కూటమిలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. వాణిజ్యం, దేశాల మధ్య అనుసంధానం పెంచుకోవడం ద్వారా ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయాలన్నది ఈ కొత్త గ్రూపు ప్రధాన ఉద్దేశమని ఆ పత్రిక పేర్కొంది.
అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఖండించింది. చైనాలో జరిగింది రాజకీయ సమావేశం కాదని, ఎలాంటి కొత్త కూటమిని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎం. తౌఫిద్ హోస్సైన్ మాట్లాడుతూ, “మేము ఏ కొత్త కూటమిని ఏర్పాటు చేయడం లేదు” అని తేల్చిచెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు, ఈ కొత్త గ్రూప్లోకి భారత్ను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సభ్యదేశాలుగా ఉన్న సార్క్ కూటమి గత కొన్నేళ్లుగా అచేతనంగా మారింది. 2016లో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సమావేశం యూరీలో ఉగ్రదాడి కారణంగా రద్దయింది. ఆ దాడి నేపథ్యంలో సదస్సులో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్లు కూడా భారత్కు మద్దతుగా సదస్సును బహిష్కరించాయి. అప్పటి నుంచి సార్క్ సమావేశాలు జరగలేదు.
Read also:Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన ఇండియన్ మార్కెట్లు!
