Donald Trump : భారత్పై అమెరికా కొత్త ఆంక్షలు? రష్యా చమురుపై 500% సుంకాల ప్రభావం:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, రష్యాతో వాణిజ్యం చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు.
ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వని దేశాలపై అమెరికా కఠిన వైఖరి: భారత్పై 500% సుంకాల ప్రభావం?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, రష్యాతో వాణిజ్యం చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు.
రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును రూపొందించారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలనే లక్ష్యంతో ఇది తీసుకురాబడింది. ఈ బిల్లుకు ఇప్పటికే 84 మంది సెనెటర్ల మద్దతు ఉన్నట్లు గ్రాహం వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక వనరుగా ఉన్న చమురు అమ్మకాలను దెబ్బతీయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి పెంచి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చర్చలకు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది.
ఈ విషయంపై సెనెటర్ గ్రాహం ఏబీసీ న్యూస్తో మాట్లాడుతూ, “రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్కు సహాయం చేయని దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 500 శాతం సుంకం విధిస్తాం. పుతిన్ యుద్ధ యంత్రాంగాన్ని నడిపిస్తుంది భారత్, చైనాలే. వారు రష్యా చమురులో 70 శాతం కొంటున్నారు. పుతిన్కు మద్దతు ఇవ్వకుండా వారిని నిరోధించేందుకు ఈ బిల్లు అధ్యక్షుడికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ బిల్లుకు ట్రంప్ మద్దతు తెలిపినప్పటికీ, ఇందులో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉందని గ్రాహం స్పష్టం చేశారు. ఒకవేళ ఈ బిల్లు కాంగ్రెస్లో ఆమోదం పొందినా, దానిని అమలు చేయాలా? వద్దా? అనే తుది నిర్ణయాధికారం అధ్యక్షుడికే ఉంటుంది అని ఆయన తెలిపారు. “జూలై విరామం తర్వాత ఈ బిల్లును ఆమోదిస్తాం. అధ్యక్షుడికి ప్రస్తుతం లేని ఒక శక్తివంతమైన సాధనాన్ని అందిస్తాం” అని గ్రాహం పేర్కొన్నారు. ఈ బిల్లును తొలుత మార్చిలో ప్రతిపాదించినా, రష్యాతో సంబంధాలను చక్కదిద్దేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న తరుణంలో శ్వేతసౌధం నుంచి వ్యతిరేకత రావడంతో వాయిదా పడింది.
పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ, భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే భారీగా చమురును దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశం మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉండగా, ఇప్పుడు అది 40 నుంచి 44 శాతానికి పెరిగింది. మే నెలలో రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకున్న భారత్, జూన్లో ఆ పరిమాణాన్ని 2 నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది.
ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారి, అమెరికా ఆంక్షలు విధిస్తే, అమెరికాకు ఎగుమతి అవుతున్న భారత ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు పడతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే, అమెరికాతో భారత్ ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఈ బిల్లుపై రష్యా కూడా స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, సెనెటర్ గ్రాహం వైఖరి తమకు బాగా తెలుసని, ఆయన ఒక తీవ్రమైన రష్యా వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. “ఇలాంటి ఆంక్షల వల్ల ఉక్రెయిన్ సమస్య పరిష్కారమవుతుందా? అనే ప్రశ్నను ఈ ప్రతిపాదనలు చేసేవారే వేసుకోవాలి” అని ఆయన అన్నారు.
Read also:Himachal Floods : హిమాచల్లో జలవిలయం: వరదలు, కొండచరియల బీభత్సం
