-
ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం నిశ్చయం?
-
ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు పూర్తయ్యాయంటూ ప్రచారం
-
అల్లు కనకరత్నం మరణంతో తాత్కాలికంగా పెళ్లి పనులకు బ్రేక్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన చిన్న కుమారుడు, యువ నటుడు అల్లు శిరీశ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీశ్ వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే చర్చలు జరిగి, పెళ్లికి అంగీకారం కుదిరిందని టాక్. అయితే, అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణంతో పెళ్లి పనులు తాత్కాలికంగా ఆగిపోయాయని, ఇప్పుడు కుటుంబం ఆ విషాదం నుంచి తేరుకోవడంతో మళ్లీ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థ ముహూర్తం ఖరారు చేసే పనిలో పెద్దలు ఉన్నారట.
అల్లు అరవింద్ కుమారుల్లో ఇప్పటికే అల్లు బాబీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివాహాలు జరిగాయి. ఇప్పుడు శిరీశ్ పెళ్లి చేసుకుంటే అల్లు కుటుంబంలో ఈ తరం పెళ్లి వేడుకలు పూర్తయినట్లే.అయితే, ఇప్పటివరకు ఈ వార్తలపై అల్లు కుటుంబం నుంచి గానీ, అల్లు శిరీశ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
