-
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాల ప్రభావం
-
ట్రంప్-జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న సమావేశం
బంగారం ధరలు ఈ మధ్యకాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సందర్భంగా రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం దిద్దుబాటుకు గురవుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి అంశాల కారణంగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే అంచనాలు ఈ ధరల తగ్గుదలకు ముఖ్య కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న జరగనున్న సమావేశంపై మార్కెట్లు దృష్టి సారించాయి. ఈ సమావేశం తర్వాత వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన వెలువడవచ్చనే అంచనాతో పసిడికి గిరాకీ తగ్గిందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 4 వేల డాలర్ల కంటే దిగువకు చేరింది.
హైదరాబాద్లో మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షలుగా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి రూ.10 వేలకు పైగా తగ్గింది. అలాగే, ఈరోజు కిలో వెండి ధర రూ. 5 వేలకు పైగా దిగొచ్చింది.
Read also : SwatiMaliwal : పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు: కేజ్రీవాల్కు స్వాతి మలివాల్ లేఖ
