తెలుగురాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. మార్కెట్లో ఏ కూరగాయను ముట్టుకున్న ధరల షాక్ కొడుతుంది. మిగిలిన కూరగాయలు, పండ్లది ఇదే పరిస్థితి. ఎండలు పెరిగిపోతున్న కారణంగా కూరగాయలు, పండ్ల దిగుబడి దాదాపు 30 శాతం తగ్గిపోనుంది. అంటే ధరలు భగ్గుమనడం ఖాయం. వేసవి ఎండలు ముదరడంతో పంటల దిగుబడి తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చేవి కూడా ఎండలకు చాలా వరకు పాడైపోతుండడంతో ఆ నష్టాలను పూడ్చుకోవడానికి వ్యాపారులు ధరలను పెంచి విక్రయిస్తున్నారు.
దీంతో కూరగాయలు కొనేదెట్టా.. తినెదెట్టా అని సామాన్యులు నిట్టూరుస్తున్నారు.ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, టమాట వంటి కూరగాయల సైజు తగ్గడమే కాదు. వాటిలో పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా పంటలకు తెగుళ్లు, కీటకాల సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్ద తేడా లేకపోవడంతో మొక్కలు హీట్ స్ట్రెస్ నుంచి కోలుకోలేకపోతున్నాయి.ధరలు అమాంతం పెరిగాయి. అందరికి అందుబాటులో ఉండే టమోటా.. కిలోకి రూ 60 వరకు అమ్ముతున్నారు..
పచ్చి మిర్చి సెంచరీ కొట్టేసింది. బీర, కాకర, చిక్కుడు కాయ కిలోకు రూ. 100లకు పైగా అమ్ముతున్నారు. ప్రధాన మార్కెట్ లో ధరలు ఇలా ఉంటే గల్లీ మార్కెట్ లో మరో 20 శాతం అదనంగా అమ్ముతున్నారు. రూ. 500 పెట్టి కూరగాయలు కొంటే. రెండు రోజులకి కూడా రావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆకు కూర ధరలు కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కొత్తిమీర, పుదినా ధరలు కూడా బిత్తరపోయేలా చేస్తున్నాయి. కూరగాయల ధరలతో పాటు చికెన్ ధర కూడా కొండెక్కింది. కిలో చికెన్ రూ. 350 ఉండటంతో సామాన్యులకు ఏం కొనాలో.. ఏం తినాలో తెలియడం లేదు.