Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న?

0

కరీంనగర్, మార్చి 26, (న్యూస్ పల్స్‌)
పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌ కాంగి‘రేస్‌’ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ స్థానానికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీనగర్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో వారిని ఎదుర్కొనేలా కాంగ్రెస్‌ అధిష్టానం తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌)ను తెరపైకి తెచ్చింది.అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న పలు నియోజకవర్గాలో‍్ల ప్రచారం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికకు సహకరించారు. కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంపీ టికెట్‌ ఇస్తే ఖర్చుపెట్టడానికి మల్లన్న సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కరీంనగర్‌ నుంచి బరిలో దించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏఐసీసీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తీన్మార్‌ మల్లన్నకు టికెట్‌ ఇవ్వడం ద్వారా పెద్దపల్లి, నిజామాబాద్‌ అభ్యర్థులను కూడా ప్రభావితం చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందిఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్‌ను పొన్నం ప్రభాకర్‌కు త్యాగం చేసిన హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది. రెండో లిస్ట్‌ ప్రకటన సందర్భంగ ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ నుంచి సంకేతాలు కూడా రావడంతో ప్రవీణ్‌రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచార రథం కూడా రెడీ చేసుకున్నారు. టికెట్‌ తనకే అనే ధీమాతో ఉన్నారు. వెలిచాల రాజేందర్‌రావు కూడా తనకు టికెట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈమేరకు సన్నిహితులు, బంధువులతో ప్రచారం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్‌ ఖరారు కాగానే ప్రచారం మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు.పారీ‍్ట సీనియర్‌ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడి‍్డ , వెలిచాల జగపతిరావు మధ్య టికెట్‌ పోటీ నెలకొనగా అధిష్టానం అనూహ్యంగా తీన్మార్‌ మల్లన్న పేరు తీసుకురావడం సంచలనంగా మారింది. ఈమేరకు తీన్మార్‌ మల్లన్నకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. వారంపాటు ఢిల్లీలో మకాం వేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్‌ స్థానం కావడం, బండి సంజయ్‌ కాపు సామాజికవర్గం నేత కావడంతో అదే సమాజికవర్గానికి చెందిన మల్లన్నను బరిలో దించితే గెలిచే అవకాశం ఉంటుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో మల్లన్న అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.