హైదరాబాద్,
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అత్యంత వైవిధ్యత కలిగిన చేవెళ్ల నియోజకవర్గంలో 29 లక్షల మంది విభిన్న కులాలు, మతాలు, భాషా బేధాలు కలిగిన వారు ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా తన సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.ఎంపీగా ఈ ప్రాంతానికి విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. కేంద్ర నిధులతో విద్య, వైద్యం కల్పించడంతోపాటు ప్రైవేట్ స్కూలు, ఆసుపత్రిలో విషయంలో నియంత్రణ చర్యలు చేపడతానన్నారు. గోవా తరహాలో కమ్యూనిటీ స్కూల్స్ తీసుకొచ్చి అధిక ఫీజుల భారం లేకుండా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. చేవెళ్ల ప్రాంత యువతను వేధిస్తున్న అతి ప్రధాన సమస్య నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానన్నారు. భారీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణను ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేస్తానన్నారు. తమ గ్రామంలోనే ఉంటూ ఉపాధి పొందే అవకాశాన్ని ఇక్కడ యువకులకు అందిస్తానన్నారు. తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ తీసుకురావడంలో తానే ముఖ్య పాత్ర పోషించానని ఆయన చెప్పారు. స్థానికంగా పండే పంటలకు అధిక ధరలు దక్కేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన సంకల్ప పత్రంలో పేర్కొన్నారు. చేవెళ్లను నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిల్లెట్స్ హబ్ గా తీర్చి దిద్దుతానని ఆయన చెప్పారు.
Prev Post
Next Post