గువ్వల బాలరాజుపై దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. రౌడీ రాజకీయాన్ని సహించమని చెప్పారు. కాంగ్రెస్ గూండాల చేతిలో గాయపడి అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి ఫ్రస్టేషన్తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చని చెప్పారు. బాలరాజుకు భద్రత పెంచాలని డిజీపీ అంజనీ కుమార్ను కోరుతున్నామన్నారు. మొన్న దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిచేశారని చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు వెళ్తుండగా, వంశీకృష్ణ తన అనుచరులతో తారసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓ వైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్ఎస్పైకి ఉసిగొల్పిన వంశీకృష్ణ, స్వయంగా రాయి తీసి విసిరి కొట్టడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.