టీఎస్పీసీకి లైన్ క్లియర్
హైదరాబాద్, జనవరి 11,
తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి కోరుకున్నదే జరిగింది.. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డితోపాటు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. దీంతో విద్యా ఉద్యోగాల విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ కు ఇప్పుడు నూతన చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది.టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్రెడ్డి, ఐదుగురు సభ్యులు గత డిసెంబర్లో తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామాల ఆమోదం విషయంలో గవర్నర్ ఆచితూచి అడుగులు వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్కు లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వం కూడా గవర్నర్కు లేఖ రాసింది. రాజీనామాల ఆమోదం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.
ఈ క్రమంలో గవర్నర్ రాజీనామాలకు ఆమోదం తెలిపారు.ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకానికి టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లోనే పరీక్షల నిర్వహణ, పారదర్శకంగా ఫలితాల ప్రకటన, తదితర ప్రక్రియలకు సరికొత్త సాంకేతిక విధానంతో పూర్తిచేస్తూ ఆదర్శంగా నిలిచింది. 2021, మే 21న టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే నూతన జోనల్ విధానం అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగ ప్రకటనలు జారీలో జాప్యం జరిగింది. 2023 ఏప్రిల్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాలకు టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత వరుసగా 30 వేల ఉద్యోగాల భరీతకి కూడా నోటిఫికేషన్లు రిలీజ్ చేసిందిపెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో టీఎస్పీఎస్సీలోనే దొంగలు తయారయ్యారు. గ్రూప్–1తోపాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బయటకు రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా టీఎస్పీఎస్పీ ప్రతిష్ట దిగజారింది. పోలీసు కేసులు నమోదు కావడం, ఉద్యోగులు జైలుకు వెళ్లడం, అప్పటికే నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయడం తదితర చర్యలు కమిషన్ను అప్రతిష్టపాలు చేశాయి.
ఈ నేపథ్యంలో విపక్షాలతోపాటు, నిరుద్యోగులు కమిషన్ చైర్మన్తోపాటు సభ్యులను మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కానీ, గత ప్రభుత్వం ఉలుకు పలుకులేకుండా వ్యవహరించింది. తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు టీఎస్పీఎస్పీ తేదీలను ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు మళ్లీ చదువుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా చివరకు టీఎస్పీఎస్పీ ప్రక్షాళన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్మన్ జనార్దన్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా ఆయన బాటలోనే నడిచారు. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది.
అందులో భాగంగా వీలైనంత త్వరగా టీఎస్ పీఎస్ సీని ప్రక్షాళన చేసి.. కొత్త కమిషన్ తో ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కమిషన్ లేకపోవడంతో గ్రూప్ -2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కమిషన్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది.మరోవైపు గతంలో పేపర్ లీకేజీ ఘటనతో అప్రతిష్ఠపాలైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనలో భాగంగా బోర్డులో సభ్యుల సంఖ్యను సైతం పెంచాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ సహా 11 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటుకను త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జనవరి చివరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రూప్ పరీక్షలు, ఇతర విభాగాల ఎగ్జామ్స్ అన్ని కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత ఇప్పటికే అధ్యయనం చేసిన యూపీఎస్ సీ పరీక్షలన నిర్వహణ మాదిరి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ రేస్ లో మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ సర్కారు త్వరలోనే క్లారిటి ఇవ్వబోతుంది