Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీఎస్పీసీలో వరుస రాజీనామాలు…

0

హైదరాబాద్, డిసెంబర్ 13,

టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం సాయంత్రం చైర్మన్ జనార్దనరెడ్డి  రాజీనామా చేయగా, నిన్న సాయంత్రం బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ  రిజైన్ చేశారు. మరికాసేపటికే మిగతా నలుగురు బోర్డు సభ్యులూ రాజీనామాలను అందించారు. సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్, కారెం రవీంద్ర రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. అది అలా ఉండగానే సభ్యులు పదవుల నుంచి తప్పుకున్నారు. తాను ఏ త‌ప్పూ చేయలేదని, అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా త‌ప్పుకుంటున్నాన‌ని సత్యనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాము బాధ్య‌తలు నిర్వ‌ర్తించే వాతావ‌ర‌ణం లేదన్నారు. ఉద్యోగార్థుల ఆకాంక్ష‌ల‌ను గౌర‌విస్తూ కొత్త క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలోనే నియామ‌కాలు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ విద్యార్థులు, నిరుద్యోగుల ప‌క్ష‌మే అని స్పష్టంచేశారు. యువత ఆశ‌లు, ఆకాంక్ష‌లు వీలైనంత త్వ‌ర‌గా నెర‌వేరాల‌ని కోరుకుంటున్నట్లు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.టీఎస్పీఎస్సీ  సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీకి కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని ఆ పదవుల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విద్యావేత్తలు, ప్రొఫెసర్లకు టీఎస్పీఎస్సీలో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.పేపర్ లీకేజీలు, పరీక్షల వరుస వాయిదాలతో మసకబారిన బోర్డు ప్రతిష్ఠను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను కొనసాగిస్తూ వాటికి పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా వాటిని రద్దు చేసి పోస్టుల సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తారా.. అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. సీఎం సీరియస్ ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.టీఎస్‌పీఎస్‌సి ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీమ్ కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie