IndiaTrade : ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: శశి థరూర్ – జాతీయ ప్రయోజనాలే ముఖ్యం : భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు లొంగకుండా జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. భారత దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు అదనపు జరిమానాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా టారిఫ్ల అంశంపై శశి థరూర్ ఈ విధంగా స్పందించారు.
వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ప్రకటన సరికాదు
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సమయంలో అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రావడం సరికాదని థరూర్ అభిప్రాయపడ్డారు. అమెరికా భారత వాణిజ్యానికి అతిపెద్ద మార్కెట్ అని, మన ఎగుమతులు 87-90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నందుకు సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ఇది ఒక హెచ్చరిక కావచ్చని థరూర్ అన్నారు.
ఈ టారిఫ్ల వల్ల ఎగుమతులు తగ్గితే అది మన దేశానికి నష్టం చేస్తుందని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఇది మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై కూడా ప్రభావం చూపించవచ్చని ఆయన తెలిపారు. అమెరికా డిమాండ్లు పూర్తిగా అర్థంలేనివిగా ఉన్నాయని, వాటిని ప్రతిఘటించే హక్కు భారత్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. వారిని సంతోషపెట్టడానికి మన జీవనోపాధిని పణంగా పెట్టలేమని, మన అవసరాలను కూడా అగ్రరాజ్యం అర్థం చేసుకోవాలని శశి థరూర్ అన్నారు.
ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో మన దేశ విధానంపై తనకు నమ్మకం ఉందని శశి థరూర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చర్చలపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా ఒత్తిళ్లకు మాత్రం ఏ మాత్రం లొంగకూడదని థరూర్ నొక్కి చెప్పారు.
Read also:Cricket : ఓవల్లో హోరాహోరీ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, టీమిండియాపై ఒత్తిడి
