-
వీడియోలలో సిక్కు గురువులను మాన్ అవమానించారని లేఖలో ఫిర్యాదు
-
వీడియోలు నిజమైతే చర్యలు తీసుకోవాలని, ఫేక్ అయితే వైరల్ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్
-
మాన్ మద్యపానం ఆరోపణపై కూడా లేఖలో ప్రస్తావించిన మలివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఆంతరంగిక కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి (సీఎం) భగవంత్ మాన్కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆమె ఈరోజు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు రెండు పేజీల లేఖ రాశారు.
ఈ లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్న స్వాతి మలివాల్… సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వీడియోల్లో భగవంత్ మాన్ సిక్కు గురువులను అగౌరవపరుస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఈ సిగ్గుచేటైన ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీనిని అత్యంత సీరియస్గా పరిగణించి వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరారు. “ఈ వీడియోలను సీఎం మాన్ పాత స్నేహితుడని చెప్పుకుంటున్న వ్యక్తి వైరల్ చేశాడు. తన వద్ద ఇలాంటివి మరో ఎనిమిది వీడియోలు ఉన్నాయని కూడా అతను చెబుతున్నాడు” అని ఆమె లేఖలో స్పష్టం చేశారు.
ఈ వీడియోల విషయంలో వాస్తవాలను వెలికితీయాలని ఆమె కేజ్రీవాల్ను కోరారు. “ఒకవేళ ఆ వీడియోలు నిజమైతే, సీఎం మాన్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అవి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన నకిలీ వీడియోలు అయితే, వాటిని వ్యాప్తి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా, స్వాతి మలివాల్ తన లేఖలో మరో తీవ్ర ఆరోపణ కూడా చేశారు. భగవంత్ మాన్ మద్యం సేవించడానికి బానిసయ్యారని, తరచూ ప్రభుత్వ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లకు మద్యం మత్తులో హాజరవుతున్నారనే ఆరోపణ ఉందని ఆమె ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, పార్టీ ప్రయోజనాలను, గౌరవాన్ని కాపాడేందుకు ఈ వీడియోలపై విచారణ జరపడం అత్యవసరమని ఆమె నొక్కిచెప్పారు.
“ఈ వ్యవహారంపై ప్రజల్లో జరుగుతున్న చర్చ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీనిపై మీరు (కేజ్రీవాల్) మౌనం వహిస్తే పార్టీకి మరింత హాని జరుగుతుంది. అందుకే ఆలస్యం చేయకుండా నిష్పాక్షికమైన, స్వతంత్ర ఫోరెన్సిక్ విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలి” అని మలివాల్ డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా సరే ఈ చర్యకు శిక్ష పడాలని ఆమె స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ సీఎం నివాసంలో జరిగిన దాడి ఘటన తర్వాత స్వాతి మలివాల్కు, ఆప్ అగ్రనాయకత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పార్టీ టికెట్పైనే 2024లో రాజ్యసభకు ఎన్నికైన ఆమె, అప్పటి నుంచి పార్టీ నాయకత్వంపై తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేయించినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.
Read also : Telangana : తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం: నలుగురు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా
