-
ఐకానిక్ వంతెన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు
-
ఓటింగ్ లో ఎక్కువ మంది మొగ్గుచూపిన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం
-
కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ కు అత్యధిక ఓట్లు
రాజధాని అమరావతిలో నిర్మించనున్న కేబుల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఖరారు చేశారు. ఈ వంతెన నమూనా ఎంపిక కోసం గతంలో సీఆర్డీఏ వెబ్సైట్లో ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు సాధించిన రెండో నమూనాను ఫైనల్ చేశారు.
కూచిపూడి నృత్య భంగిమలో డిజైన్
ఈ వంతెన కూచిపూడి నృత్యంలోని ‘స్వస్తిక హస్త’ ముద్రను పోలి ఉండటం ఒక ప్రధాన ఆకర్షణ. ఎరుపు, తెలుపు రంగుల జంట పైలాన్లతో దీన్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. నిప్పన్ కోయి లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (DPR)ను సిద్ధం చేసింది.
వంతెన నిర్మాణం, ప్రయోజనాలు
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను ఆరు లైన్లుగా నిర్మిస్తున్నారు. దీనికి ఇరువైపులా కాలిబాటలు కూడా ఉంటాయి. ఈ కేబుల్ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నది అవతల ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు, అంటే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH 65) వద్ద 5.22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది.
ప్రస్తుతం NH 65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తుంది. రద్దీ సమయాల్లో ఈ మార్గం ట్రాఫిక్తో నిండి ఉంటుంది. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మూలపాడు నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే అమరావతికి చేరుకోవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
ట్రంపెట్ ఇంటర్ఛేంజ్తో అనుసంధానం
NH 65 వద్ద వంతెన చివరన ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనదారులు సులభంగా మలుపు తిరగడానికి వీలు కల్పిస్తుంది. 2019లో టీడీపీ ప్రభుత్వం రూ. 1,387 కోట్ల అంచనాతో పవిత్ర సంగమం వద్ద ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. ప్రస్తుతం కొత్త కూటమి ప్రభుత్వం స్థలాన్ని మార్చి ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించింది. ఇది అమరావతి అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అమరావతికి ఒక నూతన గుర్తింపు రావడం ఖాయం. శిల్పకళ, సాంకేతికత, సంస్కృతుల సమ్మేళనంగా నిలిచే ఈ వంతెన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
Read also : CharlieKirk : చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి…
