-
కూలీ’ సక్సెస్ తో పూజకు పెరిగిన డిమాండ్ అన్న ప్రచారం
-
రూ. 700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం గురించి ఫిల్మ్ నగర్లో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, అందుకోసం ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో మెయిన్ టాపిక్గా మారింది.
ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక గీతం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, ఆమెకు ఐటెం సాంగ్స్ అవకాశాలు భారీగా వస్తున్నాయి. ఇదే క్రమంలో, అల్లు అర్జున్, అట్లీల సినిమాకు పూజా హెగ్డే ఐటెం సాంగ్ మెయిన్ అట్రాక్షన్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ ప్రతిపాదనకు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని టీమ్ నమ్ముతోందట.
‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను హాలీవుడ్ రేంజ్లో రూపొందిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఏకంగా ఆరుగురు కథానాయికలు నటించనున్నారని కూడా ప్రచారం ఉంది. వారిలో దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి బిగ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంపై మాత్రం చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read also : GoldPrice : పసిడి ప్రియులకు శుభవార్త : ఆకాశం నుంచి నేలకు దిగిన బంగారం ధరలు!
