- తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థుల ప్రకటన
- 96 నుంచి 105 మందికి సీఎం గ్రీన్ సిగ్నల్
- వామపక్షాలతో పొత్తుపై రాని స్పష్టత
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల కానుంది. సోమవారం శ్రావణమాసం పంచమి కావడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
సిట్టింగ్లకే గ్రీన్సిగ్నల్..
ఈ జాబితాలోనే సుమారు 96 నుంచి 105 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా సిట్టింగ్ లకే తిరిగి అవకాశం కల్పించారని సమాచారం. కాగా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ ఉంచారని తెలిసింది. కాగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ గతంలో పలుమార్లు ప్రకటించారు. అయితే వారు కోరుకున్న నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. వామపక్షాలు మొత్తంగా 6 స్థానాలను కోరుకుంటున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు పట్టున్న నియోజకవర్గాలను కేటాయించాలని గట్టిగా కోరుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఒక్కొక్క స్థానంతో సరిపెట్టుకోవాలని సూచించారు. ఇది వామపక్షాలకు రూచించడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లపై మళ్లీ వామపక్షాలు, బీఆర్ఎస్ మధ్య చర్చ జరగలేదు. దీంతో బీఆర్ఎస్, కమ్యునిస్టు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ? అన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి.
25న సెకెండ్లిస్ట్..
ఆగస్టు 25న శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజు సీఎం సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 13 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం నెలకొంది. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా? లేక కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తారా ? అనేది ఆసక్తిగా మారింది. ఎక్కువమంది అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడం బీఆర్ఎస్ వ్యూహా రచనగా తెలుస్తోంది.