పాదయాత్రలో లోకేష్ దృష్టికి క్రైస్తవ మిషనరీ భూములు…
Christian Missionary lands issue Lokesh Padayatra
- పాదయాత్రలో లోకేష్ దృష్టికి క్రైస్తవ మిషనరీ భూములు…
- ఎంపీ ఎంవివి కబ్జా చేశారని ఫిర్యాదు..
విశాఖలోని క్రైస్తవ మిషనరీ భూములను ఎంపీ ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశారని ఆరోపిస్తూ టిడిపి పార్లమెంటరీ నియోజవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఉరుకుటి డేవిడ్, పాదయాత్రలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. లోకేష్ యువగళం 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోగల జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయనను ఉరుకూటి డేవిడ్ కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్రలోని క్రిస్టియన్ మైనార్టీ మిషనరీ సీబీఎం, సీబీసీఎన్ సీ, సీబీఎల్ సీ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పారు. కాకినాడ లోని సీబీఎం 13 ఎకరాలు, భీమిలిలో సీబీఎం స్కూల్ను ఆనుకొని ఉన్న 3.5 ఎకరాలు, అదేవిధంగా దీనిలో సీబీసీఎన్ సీ మిషనరీ భూమి 10 ఎకరాలను, విశాఖ నడిబొడ్డున ఉన్న హిల్ క్రిస్ట్, మిషనరీ భూములను అమ్మడానికి ఎవరికీ హక్కు లేదని తెలిపారు.
హక్కుదారులు ఎవరు లేకపోయినప్పటికీ, విశాఖ పార్లమెంట్ ఎంపీ సత్యనారాయణ, ఎం వి వి బిల్డర్స్ పేరట 5.6 ఎకరాల భూమిని కబ్జా చేసి సి బి సి ఎన్ సి మిషనరీ భూములని తెలిసి కూడా వాటిపై నిర్మాణాలు చేపడుతున్నారని లోకేష్ కు ఆయన వివరించారు. వాటిని కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకొనేలా కృషి చేయాలని డేవిడ్ కోరారు. లోకేష్ ను కలిసిన వారిలో విశాఖ క్రిస్టియన్ మైనార్టీ పార్లమెంటు సభ్యులు అంతోని, చిన్ని, మణికుమార్, జాషువా, యెహోషువా, జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.