ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై కలెక్టరేట్లోనే తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో 186 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12330 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 20 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి చేసేందుకు స్థలం ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ప్రతి మండలంలో కోనుగోలు కేంద్రాలకు సమీపంలో తాత్కాలికంగా ధాన్యం భద్రపరిచేందుకు అవకాశం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సింగరేణి సంస్థ భవనాలు, వివిధ ప్రదేశాలు గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తహసిల్దార్ లు ప్రతి రోజూ వారి పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు 12 వేల 330 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి 11 వేల 880 మెట్రి టన్నులను రైస్ మిల్లులకు రవాణా చేశామని తెలిపారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైస్ మిల్లర్ల వద్ద స్థలం సమస్య ఉండటం, క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడిలో కొంత ఆలస్యం జరిగిందని, ఇకనుంచి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రతి మండలానికి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత, డి.ఎం.సివిల్ సప్లై రాఘవేందర్, డి సి.ఎస్.ఓ. వాజిద్ అలీ, డి.సి.ఓ. మద్దిలేటి, 11 మండలంలోని తహసీల్దార్
లు తదితరులు పాల్గొన్నారు.