ఏపీలో వినియోగదారులపై మళ్లీ విద్యుత్ ఛార్జీల భారం పడింది. కొత్త నిబంధనలతో యూనిట్పై 40పైసల చొప్పున వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో సామాన్యులకు కరెంటు వినియోగం షాక్ కొడుతోంది. విద్యుత్ రంగ సంస్కరణలతో విద్యుత్ వినియోగం భారం నానాటికి పెరిగిపోతోంది. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో నష్టాలను జనం నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా మరో గుట్టు చప్పుడు కాకుండా జనంపై మరో భారాన్ని మోపాయి.దాదాపు 15 నెలల కాలంలోనే రకరకాల పేర్లతో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నాల్గవ సారి కూడా కొత్త భారం మోపింది.
కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ట్రూఅప్ విధానాన్ని మే నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లేకుండానే డిస్కమ్లు నేరుగా వినియోగదారులపై భారాలు మోపొచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపడంతో ఛార్జీల వసూళ్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్కు 40 పైసలు చొప్పున కొత్త భారాన్ని వినియోగదారులపై డిస్కమ్లు వసూలు చేస్తున్నాయి.కొత్తగా కలిసిన ఛార్జీలతో మే నెలలో వినియోగదారులకు అధిక బిల్లులు వచ్చాయి.
ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలపై రెండుసార్లు రూ.5,983 కోట్ల భారం మోపాయి. ట్రూ అప్ పేరుతో రూ.2,900 కోట్లను 2022 ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.3,083 కోట్లను వసూలు చేస్తున్నారు.ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఇంధన సర్దుబాటు ఛార్జీలతో నెలకు రూ.280 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3 వేలకోట్ల భారం ప్రజలపై పడనుంది. దీంతో వినియోగదారుడు నెలనెల వాడిన విద్యుత్తో పాటు ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలకు 15 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఓ వినియోగదారుడు నెలకు 489 యూనిట్ల విద్యుత్ వాడితే ఎలక్ట్రిసిటీ స్లాబుల ప్రకారం వినియోగదారునికి బిల్లు రూ.3416 అవుతుంది. దీనికి ఫిక్స్డ్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీలు కలిపితే రూ.3575 అవుతుంది. ఈ బిల్లుకు ట్రూఅప్ రూ.55.70, పాత ఇంధన సర్దుబాటు ఛార్జీలు రూ.79.20, కొత్త ఇంధన సర్దుబాటు ఛార్జీలు రూ.213.60 కలుపుకుని రూ.3924 బిల్లు వచ్చింది.రాష్ట్రంలో 1.90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. మే నెలలో రాష్ట్రంలో సుమారు 7 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. మే నెలలో వాడిన విద్యుత్కుఅదనంగా యూనిట్కు40 పైసలు చొప్పున డిస్కమ్లు వసూలు చేయడంతో సుమారు రూ.280 కోట్ల భారం పడనుంది.
ఇప్పటికే 100 యూనిట్లకు ఎపిఎస్పిడిసిఎల్ వినియోగదారులు రూ.43, ఇపిడిసిఎల్ వినియోగదారులు రూ.26, సిపిడిసిఎల్ వినియోగదారులు రూ.42 చొప్పున చెల్లిస్తున్నారు.ఇప్పుడు కొత్త ఛార్జీలతో ఎస్పిడిసిఎల్ వినియోగదారులు 100 యూనిట్లకురూ.83, ఇపిడిసిఎల్ పరిధిలో వినియోగదారులు రూ.66, సిపిడిసిఎల్ వినియోగదారులు రూ.82 చొప్పున చెల్లించాలి. ఈ ఛార్జీలు మొదటి త్రైమాసికం వరకు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మారిపోతాయి. మూడు, నాల్గవ త్రైమాసికాల్లో ఇవి మారతాయి. రెండో త్రైమాసికంలో ఎస్పిడిసిఎల్ వినియోగదారులు రూ.126, ఇపిడిసిఎల్ రూ.110, సిపిడిసిఎల్ రూ.125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నెలనెలా ట్రూఅప్ విధానంతో ఏడాది చివరిలో కూడా మరోసారి డిస్కమ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి మరోసారి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది.