న్యూఢిల్లీ, అక్టోబర్ 12
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు. ద్వారక ఎక్స్ప్రెస్ వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో దాదాపు రూ.3,600 కోట్ల అవినీతి జరిగిందని లెక్కలతోసహా తేల్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విభాగంలోని అధికారులపై పగబట్టిన మోదీ సర్కారు తమ అవినీతి బతుకులను బట్టబయలు చేసిన అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు పథకాలతోపాటు కేంద్రం చేపట్టిన అనేక మౌలిక వసతుల పథకాల్లో అంచనాలను అమాంతం పెంచి ఎలా దోచుకొన్నారో నివేదికను రూపొందించి కాగ్ గత పార్లమెంటు సమావేశాల్లో సమర్పించింది. దీంతో మోదీ సర్కారు బండారం దేశానికి తెలిసిపోయింది. ఈ రిపోర్టును తయారుచేసిన అపూర్వ సిన్హా, దత్తప్రసాద్ సూర్యకాంత్ శిర్సత్, అశోక్ సిన్హా అనే సీనియర్ అధికారులపై తాజాగా ప్రభుత్వం బదిలీచేయటం చర్చనీయాంశంగా మారింది.ద్వారక ఎక్స్ప్రెస్ వే టెండర్లలో ఏకంగా 1,400 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని కాగ్ తేల్చింది.
అంటే అసలు ధర కంటే 1,400 శాతం అధికంగా కోట్ చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నమాట. కేంద్రం చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో రూ.3,600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక కుండబద్ధలు కొట్టింది. భారత్ మాల పథకంలో కూడా 60 శాతం అధిక ధరలకు కోట్చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టారని తేల్చింది. పేదలకు వైద్యం కోసం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకమైతే మరీ దారుణం. ఈ పథకంలో లబ్ధిదారులని కేంద్రం చెప్తున్నవారిలో ఏకంగా 7.5 లక్షల మంది ఒకే ఫోన్నంబర్పై రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్టు కాగ్ బయటపెట్టింది. అంటే మోదీ సర్కారు అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.మోదీ సర్కారు బదిలీలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై కేంద్రం బెదిరింపులకు దిగుతున్నదని మండిపడ్డాయి. బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆయుష్మాన్ భారత్, భారత్ మాల, ద్వారకా ఎక్స్ప్రెస్వేలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కోరాయి.