కడపలో యునానీ రీసెర్చి సెంటర్
కడప, నవంబర్ 4,
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విభజన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పలు పెండింగ్ హామీల అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలకు ముందు సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కు ఓ కీలకమైన పరిశోధనా కేంద్రాన్ని కేటాయిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇది త్వరలోనే అమలు కానుంది. వైఎస్సార్ జిల్లాలో జాతీయ స్ధాయి యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా అప్పటి కడప జిల్లాలో ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రతిపాదన పంపారు.
ఇందుకోసం జిల్లాలో 25 ఎకరాల స్ధలం కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే కేంద్రం మాత్రం వెంటనే స్పందించలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తో పాటు ఎంపీలు కూడా కేంద్రానికి ఈ యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు ఇచ్చారు. అలాగే జిల్లాలో ఉచితంగా భూమి కూడా కేటాయించేందుకు సిద్ధమని తెలిపారు. విభజన తర్వాత ఏపీకి యూనానీ రీసెర్చ్ సెంటర్ లేకపోవడంతో తెలంగాణకు మేలు జరుగుతోందని కూడా వివరించారు.
దీంతో సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత కేంద్రం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ లో యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. తాజాగా కడప శివార్లలోని పుట్లంపల్లిలో యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కేంద్రమంత్రి శర్బానంద్ సోనేవాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలా పలు వినతుల తర్వాత కేంద్రం యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సెంటర్ ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటవుతుందన్న దానిపై త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.