కర్నూలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక కొందరికి బయటకు రావడం తప్పనిసరి అవుతోంది. అలాంటి వాళ్లు వేసవి దాహార్తిని తీర్చేకునేందుకు రోడ్లపై ఉండే కొబ్బరి బోండాలు, చెరుకు రసం, జ్యూస్లు, కూల్ డ్రింక్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. అయితే.. కొబ్బరి బోండాలు నేచురల్గా పండటంతో పాటు.. ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో కోకోనట్ వాటర్కే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రజలు.ఇదే అదునుగా చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపారులు కొబ్బరి బోండాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు. అంతే కాకుండా సిండికేట్గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వేసవి తాపాన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన వారు కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. దీంతో కొబ్బరి బోండాల మాఫీయా ఎక్కువైపోతుంది. ఇక మొన్న, నిన్నటి వరకు రూ. 30, రూ. 40 ఉండే ధరలు ఇప్పుడు ఏకంగా కొండెక్కుతున్నాయి.ఒక్క కొబ్బరి బొండం ధర రూ.60 పలుకుతోంది. అయితే.. ఇతర జిల్లాలతో పోల్చితే కర్నూలు జిల్లాలో ఇది చాలా ఎక్కువగా ఉన్నాయని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొబ్బరి బోండాల ధరలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మండే ఎండలకు వడదెబ్బ కంటే.. కొబ్బరి బోండాల రేట్లు దారుణంగా ఉన్నాయంటూ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అదే బాటలో నిమ్మకాయలుఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వస్తే మాడు సుర్రుమంటోంది. ఉదయం పది దాటిందంటే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు మంచినీళ్లు, ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారు. దీంతో రాష్ట్రంలో నిమ్మకాయ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కూడా ఎప్పుడూ లేనంత ధరలు పలుకుతున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరులో బస్తా నిమ్మకాయలు ధరలు రూ.9,500 పలికింది. ఏప్రిల్ 22న నాలుగు వేలు పలికిన ధర గడిచిన నాలుగు రోజుల్లో రూ.9,500కు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరని రైతులు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.