అమరావతి ప్రభుత్వ పథకాలను నిధులు విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు కూడా నిధులు నిలిపివేయడం తగదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే నిన్ననే ఈ అంశంపై విచారణ జరిగిందని హైకోర్టు చెప్పింది. బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయించింది.కాగా తాము పథకాలను ఆపి వేయలేదని, అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని మాత్రమే తాము వివరణ అడిగామని ఎన్నికల కమిషన్ న్యాయవాది వాదనలు వినిపించారు. జస్టిఫికేషన్ ఇచ్చి మరోసారి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వాన్ని నిన్న హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.కాగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు నిధులు నిలుపుదల చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.