సికింద్రాబాద్.. రాష్ట్రంలో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలు చేసే సికింద్రాబాద్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటమే ద్యేయంగా మాలల పంతం, కిషన్ రెడ్డి అంతం అనే నినాదంతో ప్రజలలోకి వెళతామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్. వర్కింగ్ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న ) లు స్పష్టం చేశారు.. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదం సంతోష్ కుమార్ ను మాల సంఘాల జేఏసీ నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు. అనంతరం సికింద్రాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెరుకు రామచందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న దానం నాగేందర్ కు మాల సంఘాలన్ని మద్దతు తెలిపి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా దళితులుపైన, క్రైస్తవులపైన, ఆదివాసీలపైన జరిగిన అనేక దాడులను ఖండించారు. దేశంలోని ప్రజలందరికీ రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధంతో బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపు నిచ్చారు. మోదీ హయాంలో ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటికరించి అంబానీ, ఆదానిలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించింది, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది, విద్యార్థులు, యువకులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని వివరించారు.