వణికిస్తున్న చలి
న్యూఢిల్లీ, జనవరి 5,
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, యూపీలో పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. చలి, పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇదిలావుంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు. ఒకటి నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు ఈ నెల 6 వరకు సెలవులు ప్రకటించారు. అయితే 9 నుంచి 12 వరకు చదువుతున్న పిల్లలకు సెలవులు ఇవ్వకపోయినా టైమింగ్స్లో మార్పులు చేశారు. వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు ఉంటాయి.