Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వారం రోజుల్లో… రేవంత్ దూకుడు

0

హైదరాబాద్, డిసెంబర్ 14, 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి వారం రోజులు పూర్తయింది. వారంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమల్లోకి తెచ్చేసింది. మిగిలిన వాటిని అమలు చేసేందుకు.. గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకుటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం.డిసెంబర్‌ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 64 స్థానాల్లో విజయకేతనం ఎగువేసింది కాంగ్రెస్‌ పార్టీ. సొంతంగానే మెజారిటీ రావడంతో ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్‌  5న తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం. డిసెంబర్‌ 7న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ  స్టేడియంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్‌రెడ్డి. ఆయనతో పాటు 11 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ప్రమాణ  స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అలాగే వికలాంగురాలు అయిన  రజినీకి ఉపాధి కల్పించే ఉత్తర్వుపై సంతకం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రమాణస్వీకారానికి ముందే ప్రగతిభవన్‌ పేరును… బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మార్చారు.  

ప్రగతిభవన్‌ ముందున్న ఇనుప బారికేడ్లను కూడా తొలగించారు. ప్రమాణస్వీకారం చేసిన రోజు సాయంత్రమే కేబినెట్‌ సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఆరు గ్యారెంటీల అమలు, రైతులకు  ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించారు. ఇక 2014 నుంచి డిసెంబర్ 7 వరకు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా  100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు తెలిపారు. డిసెంబర్‌ 8న… విద్యుత్‌ శాఖపై రివ్యూ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. డిస్కమ్‌లు దాదాపు రూ. 85 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు. ఇక ఇటీవల  రాజీనామా చేసిన సీఎండీ ప్రభాకర్‌రావు సహా ఇతర అధికారుల రాజీనామాలు ఆమోదించొద్దని అధికారులకు సూచంచారు సీఎం రేవంత్‌రెడ్డి.  24 గంటల నిరంతర విద్యుత్  కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

డిసెంబర్‌ 9వ తేదీన ఉదయం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. అదే రోజున అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలు  శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీని అంగీకరించలేదు. ప్రమాణస్వీకారం చేయలేదు. అదే రోజు అంటే  డిసెంబర్‌ 9న సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకు వచ్చింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి  తెచ్చింది. అలాగే… రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షల వరకు పెంచించింది. ప్రజాభవన్‌లో రోజూ ప్రజాదర్భార్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమానికి వేలాది ప్రజలు వస్తున్నారు. తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. రోజూ గంటల నుంచి రెండు  గంటల పాటు ప్రజాదర్భార్‌ జరుగుతోంది. తొలి రోజు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజాదర్భాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలకు సత్వర  పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రులకు శాఖలు కేటాయించడంతో… వారు బాధ్యతలు చేపట్టారు. రోజూ రివ్యూలు చేస్తూ… ఆయా శాఖల అధికారులతో వరుస సమావేశాలు కూడా  నిర్వహిస్తున్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి కూడా వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో శాఖపై క్షుణ్ణంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పై  కూడా రివ్యూ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షళానకు ఆదేశాలు జారీ చేశారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు దగ్గర పడుతుండటంతో… పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు  ఏవిధమైన ఒత్తిడికి గురికాకుండా చూడాలని కూడా ఆదేశించారు.అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మిగిలిన వాటి అమలుపైనా దృష్టిపెట్టింది. అయితే… వాటికి  ఆర్థిక ఇబ్బందులు తప్పేలా కనిపించడంలేదు. విద్యుత్ రంగం, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై చర్చించేందుకు సీఎం సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఇందులో… విద్యుత్ రంగం మొత్తం అప్పులు సుమారు రూ.81,000 కోట్లు ఉన్నాయని, ఈ పథకం అమలుకు ఏటా రూ.4,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం  ఉందని అధికారులు ఆయనకు వివరించిన‌ట్టు స‌మాచారం.

ఇక… బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కు సిలిండర్‌, రైతులకు ఎకరాకు  రూ.15,000, అలాగే, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.  నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.4,000 పింఛన్, విద్యార్థులకు రూ.5లక్షల  చొప్పున విద్యా భరోసా కార్డు వంటివి కూడా అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ చక్కబెట్టడం… ఆర్థికపరమైన ఇబ్బందులను దాటడం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందున్న సవాళ్లు.ఇక… కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు మొదలైపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన రోజే…. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామన్న హామీ  ఏమైందని… ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రైతులు కల్లాల దగ్గర ఎదురుచూస్తున్నారని ఇంకెప్పుడు అమలు చేస్తారని విమర్శస్త్రాలను ఎక్కుపట్టేసింది. ఇప్పుడే ఆట  మొదలైందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై… విమర్శలు విల్లు ఎక్కుపెట్టారు. ఈ పరిస్థితులను కాంగ్రెస్‌ ఎలా దాటుతుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie