ఇంకా లెక్క తేలాలే…
రాయ్ పూర్, డిసెంబర్ 14,
ఆ ఆఫీసంతా నోట్ల కట్టలే.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కరెన్సీ బండల్స్.. 40 మంది సిబ్బంది 40 మిషన్స్తో లెక్కిస్తున్నా ఒడవడం లేదు. ఒడిషాలోని బాలంగిర్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన అక్రమ సంపాదనను ఆరురోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు. ఒక రూమ్ నిండా అల్మరాల్లో బయటపడ్డ కరెన్సీ కట్టల్ని 40 మంది ఐటీ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది లెక్కిస్తున్నారు. దీనికోసం తెప్పించిన 40 నోట్ల లెక్కింపు యంత్రాలు సరిపోక.. కొత్తగా కౌంటింగ్ మెషిన్లను కొనుగోలు చేశారు. మొత్తం 200 బ్యాగులుంటే వాటిలో నిన్నటికి 175 బ్యాగుల్లో లెక్కింపు పూర్తయ్యింది. ఇప్పటివరకు ఐటీ అధికారులు సీజ్ చేసిన రొక్కం అక్షరాలా రూ. 300 కోట్లు.అటు.. ఒడిశా, కోల్కతా. జార్ఖండ్లో ఆరోరోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళా రేపూ మరికొంతమంది అవినీతిమంతులు దొరుకుతారని తెలుస్తోంది.
ఎంపీ సాహుకి చెందిన బల్దేవ్ డిస్టిలరీస్ గ్రూప్నకు చెందిన బల్దేవ్ సాహు ఇన్ఫ్రా కంపెనీలో ఈ నగదు బయటపడింది. అటు.. కాంగ్రెస్ ఎంపీ కరెన్సీ వార్త దేశవ్యాప్తంగా పొలిటికల్ కాక రేపుతోంది. కాంగ్రెస్ హైకమాండ్కు ఫైనాన్సియల్ రైట్ హ్యాండ్ ఇతడే అంటూ ఫైర్ అవుతోంది బీజేపీ. రాహుల్గాంధీ స్పందించాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు కమలనాధులు. పేద రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల సంపద పెరిగిపోయిందని , ధీరజ్సాహు వ్యవహారం ఇందుకు నిదర్శనమన్నారు అమిత్షా. ధీరజ్సాహుకు మూడు సార్లు రాజ్యసభ సీటిచ్చి గౌరవించుకున్న కాంగ్రెస్ పార్టీ.. తాజా వ్యవహారంతో ఇరకాటంలో పడింది. అసలే రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది ఎంపీ సాహు అంశం.