Cargo Ship : మెక్సికో వెళ్తున్న కార్గో నౌక సముద్రంలో మునక:మెక్సికోకు 3,000 కొత్త వాహనాలను, వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలను, రవాణా చేస్తున్న ‘మార్నింగ్ మిడాస్’ అనే భారీ కార్గో నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది.
3,000 వాహనాలతో ‘మార్నింగ్ మిడాస్’ నౌక జలసమాధి
మెక్సికోకు 3,000 కొత్త వాహనాలను, వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలను, రవాణా చేస్తున్న ‘మార్నింగ్ మిడాస్’ అనే భారీ కార్గో నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది.లండన్కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ నిర్వహణలో ఉన్న ఈ నౌక, అలస్కాలోని అలూషియన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాల్లో మునిగిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం ప్రకారం, మంటల వల్ల జరిగిన నష్టం, ప్రతికూల వాతావరణం, నౌకలోకి నీరు చేరడం వంటి కారణాలతో తీరానికి 415 మైళ్ల దూరంలో, సుమారు 16,404 అడుగుల లోతున నౌక జలసమాధి అయ్యింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి, ఆఫీసర్ కామెరాన్ స్నెల్ తెలిపారు.
మూడు వారాల క్రితం, అంటే ఈ నెల 3న, అలస్కా తీరానికి దాదాపు 300 మైళ్ల దూరంలో ఉండగా నౌకలో మంటలు చెలరేగాయి. నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో యూఎస్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్బోట్ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. వారిని సమీపంలోని ఓ వాణిజ్య నౌక సిబ్బంది రక్షించారని కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది.చైనాలోని యెంటాయ్ నుంచి మే 26న బయలుదేరిన ఈ నౌక మెక్సికోలోని లాజారో కార్డెనాస్కు వెళ్తోంది. మంటలను ఆర్పేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది తొలుత విమానాలు, ఒక కట్టర్ షిప్ను పంపారు. అయితే ప్రయోజనం లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఒక సహాయక బృందాన్ని పంపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైబీరియా జెండాతో రిజిస్టర్ అయిన ఈ నౌకను 2006లో నిర్మించారు.
Read also:CM Chandrababu : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
